
నంద్యాల, 17 మే (హి.స.)నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ రోజు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.
ఆటోను త్రాడుతో లాగుతూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిందని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. వెంటనే పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డోన్ పట్టణ సీపీఎం కార్యదర్శి నక్కీ శ్రీకాంత్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు.
ఇంధన ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింతగా ఉద్యమిస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV