
తిరుమల, 17 మే (హి.స.)
కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో భక్తుల జాతర కొనసాగుతుంది. ముఖ్యంగా వేసవి సెలవులు, వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి వేలాదిమంది భక్తులు తరలి వచ్చారు. దీంతో తిరుమల కొండపై జనసందోహం నెలకొంది. స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి పోటెత్తిన భక్తులతో తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్లు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోవడంతో, వేలాది మంది భక్తులు వెలుపల కిలోమీటర్ల మేర ఉన్న క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు.
ఈ భారీ రద్దీ కారణంగా ఎలాంటి ముందస్తు టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి ప్రస్తుతం 16 గంటల సుదీర్ఘ సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా మంచినీరు, పాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు, తిరుమలలో భక్తుల రాక కు సంబంధించిన రికార్డు స్థాయి గణాంకాలను అధికారులు విడుదల చేశారు. నిన్న ఒక్కరోజే మొత్తం 90,011 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, మొక్కులు చెల్లించుకోవడం లో భాగంగా 39,083 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు తమ భక్తిని చాటుకుంటూ శ్రీవారి హుండీలో సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే ఏకంగా రూ. 3.76 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV