
కోల్కతా, 20 మే (హి.స.)బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ త్వరలోనే కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. తన నివాసంలో టీఎంసీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలు, వీధి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటోందని మమత ఆరోపించారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. వీధి వ్యాపారుల దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగ విలువలను కాలరాస్తోంది అని ఆమె విమర్శించారు.
ఇదే సమావేశంలో పాల్గొన్న టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా బీజేపీకి సవాల్ విసిరారు. తన ఇంటిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) ఇచ్చిన నోటీసులపై ఆయన ఘాటుగా స్పందించారు. వారు నా ఇల్లు కూల్చినా సరే.. ఇలాంటి బెదిరింపులకు నేను తలొగ్గేది లేదు. ఏదేమైనా బీజేపీపై నా పోరాటం కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ నోటీసులు జారీ చేసిన కేఎంసీ ఇప్పటికీ టీఎంసీ నియంత్రణలోనే ఉండటం గమనార్హం.
ఈ సందర్భంగా సీఎం సువేందు అధికారిపై అభిషేక్ పరోక్షంగా విమర్శలు చేశారు. కెమెరా ముందు డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు అని 2014 నాటి నారద స్టింగ్ ఆపరేషన్ను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సృష్టిస్తున్న ‘బుల్డోజర్ సంస్కృతి’కి వ్యతిరేకంగా మే 21 నుంచి కోల్కతాలో భారీ నిరసనలు చేపట్టాలని టీఎంసీ నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi