
న్యూఢిల్లీ, 29 మే (హి.స.)
నీట్ యూజీ (NEET-UG) పరీక్షల
పేపర్ లీక్ వివాదంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలకమైన అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఏ పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. పరీక్షా విధానంలో తాము తీసుకొచ్చిన విస్తృతమైన సంస్కరణలు, భద్రతా మార్పులను ఎన్టీఏ కోర్టుకు వివరించింది. పరీక్షల పారదర్శకతను పెంచేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన మాజీ ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణన్ కమిటీ (HLCE) సిఫార్సులలో చాలా వరకు ఇప్పటికే అమలు చేశామని, అవన్నీ ముగింపు దశలో ఉన్నాయని ఎన్టీఏ తన నివేదికలో కోర్టుకు తెలిపింది.
అయితే, ఎన్టీఏ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి 16 కొత్త సీనియర్ పోస్టులను ఏర్పాటు చేశారు. టెక్నాలజీ ఆపరేషన్స్, టెస్ట్ సెక్యూరిటీని పర్యవేక్షించడానికి ఇద్దరు జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులను అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ (Additional Directors General)గా నియమించారు. పరీక్షా కేంద్రాల్లో కచ్చితంగా సీసీటీవీలు తనిఖీ చేయాలని, పరీక్ష ముగిసిన తర్వాత కూడా ఆ ఫుటేజీని కనీసం 90 రోజుల పాటు భద్రపరచాలని ఆదేశించారు. అంతేకాకుండా, రియల్ టైమ్లో దొరకని అక్రమాలను గుర్తించేందుకు పరీక్షల అనంతరం సీసీటీవీ ఫుటేజీలపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుపుతామని వెల్లడించింది. భవిష్యత్తులో నీట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్లో నిర్వహించాలా..? లేక పెన్ అండ్ పేపర్ (PPT) పద్దతిలోనే కొనసాగించాలా? అనే అంశంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి హైపవర్డ్ కమిటీ
త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ఎన్టీఏ కోర్టుకు అఫిడవిట్ రూపంలో విన్నవించింది.
కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు..
పరీక్షల భద్రత కోసం దేశవ్యాప్తంగా స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీలను (SLCC, DLCC) ఏర్పాటు చేశారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఇంటెలిజెన్స్, ఎన్టీఏ అధికారులు భాగస్వాములుగా ఉంటారు. ఐఐటీ (IIT), యూజీసీ (UGC), సీబీఎస్ఈ (CBSE) వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణులను కూడా ఎగ్జామినేషన్ మేనేజ్మెంట్లో భాగస్వామ్యం చేసినట్లుగా ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..