
కర్నూలు, 30 మే (హి.స.)
కర్నూలు నగరంలో చేపడుతున్న పూడికతీత పనులు నాణ్యంగా చేపట్టాలని, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. ఈ రోజు ఉదయం ఆయన ఏ.క్యాంపు, బి.క్యాంపు, గణేష్ నగర్ వద్ద సుద్దవాగు, సంకల్ బాగ్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. 9వ డివిజన్లో మస్టర్ తనిఖీ నిర్వహించారు. అనంతరం ఎన్ఆర్ పేటలో కొనసాగుతున్న పూడికతీత పనులను తనిఖీ చేశారు.
డ్రైన్ల కింది భాగం వరకు పూడికతీత పనులు చేపట్టకపోవడంపై అమినిటీస్ కార్యదర్శులపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూడికతీత పనులు పూర్తిచేయాలని, కింది భాగం వరకు పూడికలు తీయని పక్షంలో బిల్లులు నమోదు చేయవద్దని స్పష్టం చేశారు.
అనంతరం కలెక్టరేట్లోని అన్న క్యాంటీన్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV