తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు
శ్రీధర్


చెన్నై, 07 మే (హి.స.)

ప్రముఖ టెక్ సంస్థ జోహో (Zoho) సహ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి అస్థిరంగా కనిపిస్తోందని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆయన ఈ అభిప్రాయాలు పంచుకున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ దక్కే అవకాశం కనిపించడం లేదని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. వివిధ రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూటమిగా ఏర్పడే ప్రభుత్వం నిలకడగా ఉండదని, అది రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, 'ఓటుకు నోటు' పద్ధతికి తావులేకుండా కఠిన నిబంధనలతో కొత్తగా ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమ మార్గం. అప్పుడు ప్రజల నిజమైన తీర్పు ఎవరికో తెలుస్తుంది అని ఆయన తన పోస్టులో రాశారు.

కొత్తగా ఎన్నికలు జరిగితే నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ 'సూపర్ మెజారిటీ' సాధిస్తుందని శ్రీధర్ వెంబు విశ్వాసం వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు దీనిని ఆపాలనుకుంటే కలిసి పోటీ చేయాలని సూచించారు. మరోవైపు బీజేపీ సున్నా సీట్లు గెలిచినా సరే తమిళనాడులో ఒంటరిగా పోటీ చేయాలని, పార్టీకి ఇది ఒక కొత్త ప్రారంభం అవుతుందని ఆయన సలహా ఇచ్చారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలున్న తమిళనాడులో టీవీకే పార్టీ మెజారిటీ మార్కుకు కొద్ది దూరంలో నిలిచి, ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande