రూ.16.13కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి
రూ.16.13కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి
Ponguleti


ఖమ్మం, 27 జూన్ (హి.స.) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో శనివారం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. దుబ్బ తండా, లాల్ సింగ్ తండా, జీళ్లచెరువు గ్రామాల్లో రూ.16.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. వర్షాకాలంలో తండాలు, పల్లె ప్రజలు బురద రోడ్లు, ఉధృతంగా ప్రవహించే వాగుల వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకే ఈ పనులను త్వరితగతిన మంజూరు చేయించామని పేర్కొన్నారు. వానలు పడుతున్న ప్రజల కోసం ప్రగతి పనులు ఆపబోమని, అధికారులు కూడా అంతే వేగంతో నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

మంత్రి పొంగులేటి తన పర్యటనలో భాగంగా దుబ్బ తండా గ్రామంలో జడ్పీ రోడ్డు గైగోల్లపల్లి నుంచి దుబ్బ తండా వరకు రూ. 2.10 కోట్ల అంచనా వ్యయంతో, అలాగే జడ్పీ రోడ్డు నుండి కొత్తూరు - ఎర్రగడ్డ తండా మీదుగా దుబ్బతండా వరకు రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లాల్ సింగ్ తండా నుంచి నేరేడు వాయి వరకు రూ.2.03 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, జీళ్ళ చెరువు గ్రామంలో జీళ్లచెరువు మీదుగా కొండాపురం నుంచి మోటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై రూ. 7.50 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రెండు వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande