
భూపాలపల్లి, 28 జూన్ (హి.స.) భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డ్రగ్స్ గంజాయి నిల్వల కోసం వాటిని సేవిస్తున్న వారి కోసం ఆదివారం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు, సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో జిల్లా నార్కోటిక్స్ విభాగం పోలీసులు, నార్కోటిక్స్ జాగిలంతో కలిసి ఆదివారం ఉదయం భూపాలపల్లి బస్టాండ్, బాంబులగడ్డ ప్రాంతంతో పాటు గంజాయి సేవించే అవకాశం ఉన్న అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. గతంలో గంజాయి సేవిస్తూ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారి నివాసాల్లో, అనుమానితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ లక్ష్యమని, మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ, అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు, నిల్వ ఉంచినట్లు లేదా రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే 100 లేదా 8712658111 నంబర్కు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సోదాల్లో నార్కోటిక్స్ విభాగం ఆర్ఎస్ఐ రాజేష్, సిబ్బంది శ్రీనివాస్, ప్రశాంత్, శ్రీనివాస్ డాగ్ హ్యాండ్లర్ శ్రీధర్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు