
హైదరాబాద్, 28 జూన్ (హి.స.)
నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది. సీఎం పర్యటనతో పాటు హ్యామ్ రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఆర్అండ్బీ శాఖ చేసిన పత్రికా ప్రకటనల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫొటో లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి అయినప్పటికీ అధికారిక ప్రకటనలో తన ఫొటోను చేర్చకపోవడంపై గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించిన ప్రొటోకాల్ జాబితాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్నా కైలష్ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బలహీనవర్గానికి చెందిన నేతను ఉద్దేశపూర్వకంగానే అడుగడుగునా అవమానిస్తున్నారని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi