
హుజురాబాద్, 29 జూన్ (హి.స.)
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, వారి సేవలోనే నిరంతరం శ్రమిస్తామని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. హుజురాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి, రాజపల్లి, చెల్పూర్, బొత్తలపల్లి, పెద్దపాపయ్యపల్లి, కాట్రపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే స్వయంగా పర్యటించారు. లబ్ధిదారుల ఇండ్ల వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ నిధి కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్తూ, క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలవడమే ప్రజాప్రతినిధిగా తన ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల కష్టసుఖాల్లో నేను ఎల్లప్పుడూ భాగస్వామినై ఉంటాను. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తాను. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసమే నాకు కొండంత బలం. వారి సేవ చేయడమే నా బాధ్యత, సంక్షేమమే నా ఏకైక లక్ష్యం. అని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా తాము ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..