
హైదరాబాద్, 30 జూన్ (హి.స.)హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ వద్ద బహుళ అంతస్తుల ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జులై 1 నుంచి డీఎల్ఎఫ్ గేట్ నంబర్ 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు రహదారిని మూడు నెలలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాణ పనులు సుమారు ఏడాదిపాటు కొనసాగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఐఐఐటీ, డీఎల్ఎఫ్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లోని ఐటీ సంస్థలకు వెళ్లే ఉద్యోగులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేష్ విజ్ఞప్తి చేశారు
ర్యాడిసన్ హోటల్ వైపు నుంచి ఐఐఐటీ జంక్షన్కు వెళ్లే వాహనాలను డీఎల్ఎఫ్ గేట్ నం.1 వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. ఈ వాహనాలు గచ్చిబౌలి జంక్షన్ - ఇందిరానగర్ మీదుగా ఐఐఐటీ జంక్షన్ చేరుకోవాలి. టీసీఎస్ సంస్థ నాన్-ఎస్ఈజడ్ (సీఎంసీ) గేట్ ద్వారా రాకపోకలు సాగించే ఉద్యోగులకు యథావిధిగా అదే ప్రవేశ, నిష్క్రమణ మార్గాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించారు.
లింగంపల్లి వైపు నుంచి డీఎల్ఎఫ్ రోడ్డుకు వెళ్లే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి ఐఐఐటీ జంక్షన్-గచ్చిబౌలి జంక్షన్-ర్యాడిసన్ జంక్షన్ మీదుగా డీఎల్ఎఫ్ ప్రాంతానికి చేరుకోవాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్