
అమరావతి, 01 జూలై (హి.స.)
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులోహెడ్కానిస్టేబుళ్లు అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో పోతర్లంక అశోక్ కుమార్, జంగం నాని నిజాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు అధికారి అడిగిన ప్రశ్నలకు మౌనం వహించారని చెప్పారు. హెడ్ కానిస్టేబుళ్లు ఉపయోగిస్తున్న ఫోన్లను అప్పగించాలని అడిగితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాగపూర్లో గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించామని అన్నారు.
మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసుస్టేషన్కు వచ్చిన సాయికృష్ణ ఏమయ్యాడనే విషయాన్ని వెలికి తీయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. టాస్క్ఫోర్స్ ఎస్ఐ నవీన్, కానిస్టేబుళ్లు మురళీకృష్ణ కుమార్, బొస్తా రాంబాబు, కృష్ణలంక కానిస్టేబుల్ బాబూరావు మార్కాపురం వెళ్లారు. మే ఐదో తేదీ రాత్రి 7:39 గంటల వరకు సాయికృష్ణ మొబైల్ టవర్ లోకేషన్ మార్కాపురంలోని వడ్డే బజార్లో చూపించిందని పోలీసులు వెల్లడించారు.
ఆరో తేదీ తెల్లవారుజామున 3:53 గంటలకు బాబూరావు మొబైల్ టవర్ లొకేషన్ మార్కాపురంలో చూపించిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఎన్బీడబ్ల్యూ అమలు చేయడానికి తీసుకువచ్చిన నిందితుడిని కోర్టులో హాజరుపరిచే గడువుకు ముందు నిర్బంధంలో ఉంచారని అన్నారు. ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులంతా కలిసి సాయికృష్ణను అదృశ్యం చేశారు. ఇంకా వీరిని సమగ్ర విచారణ చేసి సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ