నంద్యాల జిల్లాలో విషాదం
నంద్యాల జిల్లాలో విషాదం
నంద్యాల జిల్లాలో విషాదం


అమరావతి, 01 జూలై (హి.స.)

నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అక్క పెళ్లి పత్రికకు సంబంధించిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మృతుడు సంజపోగు కల్యాణ్ (20)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు, పోలీసుల సమాచారం ప్రకారం, కల్యాణ్ తన అక్క వివాహ ఆహ్వాన పత్రికపై సిలువ బొమ్మ ముద్రించడం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశాడు. హిందూ దేవుళ్లను ఆరాధించే కల్యాణ్, పెళ్లి పత్రిక రూపకల్పనపై తన తండ్రి కురుమయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయమై కుటుంబంలో చర్చ జరిగినప్పటికీ, ఇప్పటికే ముద్రించిన పెళ్లి పత్రికలను మార్చడం సాధ్యం కాదని తండ్రి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కల్యాణ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటన సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కురుమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబంలో జరిగిన వివాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande