
నాగర్ కర్నూల్, 01 జూలై (హి.స.)
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించిన కమిషనర్కు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ పురోగతిని కమిషనర్ సమీక్షించారు. ఓటరు జాబితాల నవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ జిల్లాలో ఎస్ఐర్ అమలు తీరును, బూత్ స్థాయి అధికారుల పనితీరును, ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల పరిశీలన విధానాన్ని కమిషనర్కు వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న పరిపాలనా చర్యలను కూడా ఆమెకు నివేదించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..