
హైదరాబాద్, 02 జూలై (హి.స.)కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సెటైర్లు గుప్పించారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతోపాటు అవినీతి, అక్రమాలపైనా చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. ‘వారెవ్వా... మీ డ్రామాలు బిగ్బాస్ షోను తలపిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నటన అద్భుతం. ప్రతివారం ముందే రిహార్సల్ చేసి పోటాపోటీగా నటనలో జీవిస్తున్నారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులే. అయినా.... తెలంగాణ ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నారా..?. మిమ్ముల్ని చూసి నవ్వుకుంటున్నారు’ అని బండి సంజయ్ విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల తీరును బండి సంజయ్ ఎండగట్టారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన వైఫల్యాలపై చర్చకు రావాలి..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలోని అవినీతి, అక్రమాలపైనా చర్చిద్దాం రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆధ్వర్యంలో డేట్, టైం, వేదిక ఫిక్స్ చేస్తామని అన్నారు. ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులు, అందించిన సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చించడానికి రావాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇలానే డ్రామాలు ఆడితే జనం ఛీ కొట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఈ రాజకీయ బిగ్బాస్ షోలో.... ప్రజలు డబుల్ ఎలిమినేషన్ కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్