పేపర్ లీకేజీల నిరోధక బిల్లుపై ప్రధాని మోదీ ప్రత్యేక వీడియో: ప్రతిపక్షాల విమర్శలు
పేపర్ లీకేజీల నిరోధక బిల్లుపై ప్రధాని మోదీ ప్రత్యేక వీడియో: ప్రతిపక్షాల విమర్శలు
PM Narendra Modi (File)


న్యూఢిల్లీ:, 31 జూలై (హి.స.)

దేశంలో ప్రభుత్వ మరియు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడానికి పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన 'ప్రభుత్వ పరీక్షల (అక్రమ మార్గాల నివారణ) సవరణ బిల్లు–2026' పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ చట్టాన్ని ప్రశంసిస్తూ ఆయన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ చట్టం భారతదేశ యువత భవిష్యత్తుకు భద్రతనిస్తుందని, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లీకేజీల ముఠాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

చట్టంలోని ముఖ్య నిబంధనలు

- కఠిన జైలు శిక్ష: ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం, వ్యక్తిగతంగా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినా లేదా పేపర్ లీక్ చేసినా 5 నుండి 10 సంవత్సరాల వరకు గరిష్ట జైలు శిక్ష విధిస్తారు.

- భారీ జరిమానా: దోషులకు ₹50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకవేళ వ్యవస్థీకృత ముఠాలు (Organised Syndicates) ఈ నేరానికి పాల్పడితే, జరిమానా ఏకంగా ₹10 కోట్ల వరకు ఉంటుంది.

- ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: కేసుల విచారణ వేగంగా ముగిసేందుకు వీలుగా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. దర్యాప్తు సంస్థలు రెండు నెలల్లో విచారణను, కోర్టులు మూడు నెలల్లో ట్రయల్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

- సంస్థలపై నిషేధం: లీకేజీలకు సహకరించే సేవా సంస్థలను (Service Providers) 8 ఏళ్ల పాటు పరీక్షలు నిర్వహించకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.

ప్రతిపక్షాల విమర్శలు:ఒకవైపు ప్రధాని మోదీ ఈ బిల్లును సోషల్ మీడియాలో కొనియాడుతుండగా, మరోవైపు పార్లమెంట్‌లో దీనిపై తీవ్ర రాజకీయ రగడ నడుస్తోంది. సీపీఎం (CPI-M) ఎంపీ వి. శివదాసన్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న ఇంతటి తీవ్రమైన బిల్లుపై పార్లమెంట్‌లో కనీసం చర్చ కూడా జరగకుండానే ఆమోదించుకున్నారని ఆయన మండిపడ్డారు. సభలో ఇంత ముఖ్యమైన విషయంపై చర్చ జరుగుతుంటే, దానికి సమాధానం చెప్పడానికి ప్రధాని మోదీ సభకు రాకుండా, కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టడంపై శివదాసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమవుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande