
మచిలీపట్నం:, 04 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను దూషించిన కేసులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్ నాలుగోసారి అరెస్టయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు మచిలీపట్నంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న (శుక్రవారం) జోసెఫ్ రావణ్కు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చిన కాసేపటికే పాయకరావుపేట పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నేడు విచారణ నిమిత్తం అక్కడి కోర్టులో హాజరుపర్చనున్నారు.
కాగా, జూన్ 30న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందుత్వవాది రాధా మనోహర్ దాస్పై యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తొలుత పిఠాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత బుధవారం నాడు హైదరాబాద్లో అతన్ని పోలీసులు అరెస్టు చేయగా పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే మరో కేసులో రావణ్ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులోనూ బెయిల్ వచ్చింది. ఇదే సమయంలో శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు కూడా కేసు నమోదు చేసి రావణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇనగుదురు పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.
అనంతరం జోసెఫ్ రావణ్ను శుక్రవారం రాత్రి మచిలీపట్నం మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం ఈ కేసులోనూ అతనికి బెయిల్ ఇచ్చింది. రావణ్ తరఫున జడ శ్రవణ్ కుమార్, ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీలు సిద్దిఖ్, హిమబింధు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం జోసెఫ్ రావణ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇదే సమయంలో ఒంగోలు, పాయకరావుపేటలో జనసేన నేతల ఫిర్యాదుతో రావణ్పై కేసులు నమోదయ్యాయి. పాయకరావుపేట కేసులో భాగంగా మచిలీపట్నం కేసులో బెయిల్ వచ్చిన వెంటనే రావణ్ను పోలీసులు అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ