మెట్రో ఫేజ్-2 పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
మెట్రో ఫేజ్-2 పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Cm


హైదరాబాద్, 05 జూలై (హి.స.)

హైదరాబాద్ మహానగరం భవిష్యత్తుకు

ఎంతో కీలకమైన మెట్రో విస్తరణ ప్రాజెక్టును వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు ఆయన ఒక లేఖ రాశారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని ఆ లేఖలో సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-1 టేకోవర్ (రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విలువల నిర్ధారణ (Valuation) బాధ్యతలను ఎస్బీఐ క్యాప్స్ (SBICAPS) సంస్థకు అప్పగించాల్సి ఉంది. అయితే, ఎస్బీఐ క్యాప్స్ పరిధిలో జరుగుతున్న జాప్యం కారణంగా మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఈ ఆలస్యం వల్ల మెట్రో ఫేజ్-2 నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రుణాల రీఫైనాన్సింగ్పై త్వరగా నిర్ణయం తీసుకోండి..

మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన రుణాల రీఫైనాన్సింగ్పై కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో ఫేజ్ -2 నిధుల సమీకరణ కోసం ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించాలని ఆయన కేంద్రమంత్రులను కోరారు. హైదరాబాద్ నగర అంతర్జాతీయ స్థాయి రవాణా అవసరాలకు మెట్రో విస్తరణ అత్యంత కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande