
అయోధ్య, 05 జూలై (హి.స.) అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాను, తన కుటుంబం అత్యంత భక్తిశ్రద్ధలతో బహూకరించిన కోట్లాది రూపాయల విలువైన బంగారు పూత 'రామచరితమానస్' గ్రంథం అదృశ్యం కావడంపై కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన స్పష్టత కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్. లక్ష్మీనారాయణన్, ఆయన భార్య సరస్వతి కలిసి 2024 ఏప్రిల్లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఒక అమూల్యమైన బహుమతిని సమర్పించారు. తులసీదాస్ రచించిన రామచరితమానస్లోని 10,902 శ్లోకాలతో కూడిన 522 పేజీలకు బంగారు పూత పూయించి, ఒక గ్రంథంగా రూపొందించారు.
సుమారు 147 కిలోల బరువున్న ఈ గ్రంథం విలువ దాదాపు రూ.4.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ గ్రంథాన్ని ఆలయంలో కొన్ని నెలల పాటు భక్తుల దర్శనార్థం ఉంచారని, ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా దానిని అక్కడి నుంచి తొలగించారని లక్ష్మీనారాయణన్ ఆవేదన వ్యక్తం చేశారు
. .. రామజన్మభూమి ఉద్యమంతో మా కుటుంబానికి ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. నా దివంగత తల్లి ఏళ్ల తరబడి రామనామాన్ని రాశారు. నా పదవీ విరమణ తర్వాత వచ్చిన సంపాదనతో శ్రీరాముడికి సేవగా ఈ కానుకను సమర్పించాను. దీని ద్వారా గుర్తింపు కోరుకోవడం లేదు, కేవలం పారదర్శకత మాత్రమే కావాలి. ప్రతిరోజూ దానికి పూజలు జరిగేవి, భక్తులు దర్శించుకునేవారు. అప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ అకస్మాత్తుగా దాన్ని అక్కడి నుంచి తీసేశారు అని ఆయన వాపోయారు. ఈ విషయంపై ఆలయ అధికారులను, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను సంప్రదించినా సరైన సమాధానం రాలేదని లక్ష్మీనారాయణన్ తెలిపారు.
ఈ వ్యవహారాన్ని ఆయన ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కూడా సమావేశమై తన ఆందోళనను వివరించారు. ఇప్పటికే ఆలయ విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ కేసులో భాగంగా నగదు నిర్వహణ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగితో సహా 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో పాటు మరో ట్రస్టీ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇలాంటి కుంభకోణం సరైన పర్యవేక్షణ లోపం వల్లే జరిగిందని, ఇది పూర్తిగా నివారించదగినదని లక్ష్మీనారాయణన్ అభిప్రాయపడ్డారు. ఈ గ్రంథం ప్రస్తుతం ఎక్కడ ఉందనే దానిపై ఆలయ ట్రస్టు అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించిన విరాళాలు, కానుకల విషయంలో జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్ ఈ ఘటనతో మరింత బలపడింది ---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi