
హైదరాబాద్, 05 జూలై (హి.స.)
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) కోవర్టుగా వ్యవహరిస్తూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కిరణ్ రాయల్, ఈ ఆరోపణలకు సంబంధించి కొన్ని ఆడియో క్లిప్పింగులను విడుదల చేశారు.
రావణ్, శ్రవణ్ అనే వ్యక్తులతో కలిసి ప్రకాశ్ రాజ్ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం ద్వారా పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు జరుగుతున్న పెద్ద కుట్రలో ప్రకాశ్ రాజ్ భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘మావిగాన్’ వంటి నాటకాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారని, అమరావతి రైతులపై దాడులు జరిగినప్పుడు ఒక వర్గాన్ని దోషిగా చూపే ప్రయత్నం జరిగిందని కిరణ్ రాయల్ గుర్తుచేశారు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న వారిపై పోలీసులు నమోదు చేస్తున్న కేసులు బలహీనంగా ఉండటం వల్ల, నిందితులు సులభంగా బెయిల్ పొందుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కిరణ్ రాయల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi