
తిరుమల, 05 జూలై (హి.స.) కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలనే ఆమె అచంచల భక్తి అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఆదివారం ఉదయం ప్రకటించారు.
ఆదివారం ఎక్స్లో స్పందించిన ఆయన, ‘116 ఏళ్ల వయస్సులోనూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆ వృద్ధ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆ భక్తురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించుకున్నాను. ఆమె గురించి ఎవరికైనా వివరాలు తెలిసి ఉంటే, దయచేసి టీటీడీ చైర్మన్ తిరుమల క్యాంపు కార్యాలయాన్ని నేరుగా సంప్రదించగలరు’ అని తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా బీఆర్ నాయుడు హృదయపూర్వకంగా ప్రార్థించారు. కాగా, కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకున్న వృద్ధురాలి వీడియో (ఆదివారం) సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో టీటీడీ చైర్మన్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV