
హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కు ప్రతిష్టాత్మక 'లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2026' లభించింది. పుణెలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహించారు.
అమితమైన స్ఫూర్తి: అమిత్ షా
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, తిలక్ నిర్భయ జాతీయవాదానికి, దోవల్ రూపొందించిన ఆధునిక భద్రతా వ్యవస్థకు మధ్య ఉన్న సారూప్యతను వివరించారు. దేశ అంతర్గత, బాహ్య భద్రతా చరిత్రను రాసేటప్పుడు అజిత్ దోవల్ పేరు బంగారు అక్షరాలతో నిలిచిపోతుందన్నారు.
2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే దోవల్ను ఎన్ఎస్ఏగా నియమించారని, ఆ నిర్ణయంతో భారత విదేశాంగ, భద్రతా విధానాలకు ఒక ఉక్కు వెన్నెముక ఏర్పడిందని కొనియాడారు.
పాత జ్ఞాపకాల గుర్తు:
తాను గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల విచారణలో దోవల్ అందించిన విలువైన సమాచారం, మార్గదర్శకత్వం వల్ల గుజరాత్ పోలీసులు దేశవ్యాప్తంగా జరిగిన 13 బాంబు పేలుళ్ల కేసులను ఒకేసారి ఛేదించగలిగారని షా గుర్తుచేసుకున్నారు.
తిలక్ ప్రారంభించిన గణపతి, శివాజీ ఉత్సవాలు దేశంలో సాంస్కృతిక జాతీయవాదాన్ని పెంపొందించాయని, అదే మార్గంలో నేడు దేశం పురోగమిస్తోందని పేర్కొన్నారు. దోవల్కు లభించిన ఈ పురస్కారం దేశ సేవలో ఉన్న ప్రతి పౌరుడికి గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi