
కోల్కతా, 19 ఆగస్టు (హి.స.)కోల్కతాలో ఓ హోటల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. న్యూమార్కెట్ ప్రాంతంలోని ఫ్రీ స్కూల్ వీధిలో అర్ధరాత్రి 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పలువురు చిక్కుకుపోయి మరణించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారందరూ బంగ్లాదేశీయులేనని అగ్నిమాపక శాఖ తెలిపింది. మెడికల్ ట్రీట్మెంట్ కోసం వారు కోల్కతాకు వచ్చారని అధికారులు తెలిపారు.
ఏసీ పేలడంతో మూడో అంతస్తులో మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఘటనకు గల కారణం ఇంకా వెల్లడించలేదు. మంటలు చెలరేగగానే హోటల్లోని కొందరు బయటకు పరుగుతీశారు. అగ్నికీలలు చుట్టూ ఉన్న ఇళ్లవైపు వ్యాపించడంతో ప్రజలు హాహాకారాలు చేశారు. ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. దట్టమైన పొగ వ్యాపించడంతో సహాయ కార్యక్రమాలకు కాస్త అంతరాయం ఏర్పడిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం బిర్భూమ్ జిల్లాలోని ఓ హోటల్ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV