
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.) కొత్త కారు కొన్న ఆనందంలో పూజ చేయించేందుకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయానికి వచ్చిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన తుమ్ములపల్లి రామచంద్రరావు (70) తన భార్య గంగాభవానితో కలిసి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వచ్చారు. మియాపూర్లో ఉంటున్న అతని మేనల్లుడు సాయికుమార్ కొత్త కారు కొనుగోలు చేయడంతో కుటుంబ సభ్యులతో కలిసి పెద్దమ్మతల్లి ఆలయానికి వెళ్లారు. పూజ సమయంలో కారును కాస్త ముందుకు నడపాలని పూజారి సూచించారు. దీంతో సాయికుమార్ కారును ముందుకు నడిపే క్రమంలో.. బ్రేక్ బదులు ఎక్సలేటర్ తొక్కడంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఆ సమయంలో కారు ముందు నిల్చున్న రామచంద్రరావును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేనల్లుడు కొత్త కారు కొన్న ఆనందంలో పూజకు వచ్చిన కుటుంబంలో.. అదే కారు కారణంగా మామ ప్రాణాలు కోల్పోవడం విషాదం మిగిల్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్