
ఢిల్లీ , 29 ఆగస్టు (హి.స.)
ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ (Delhi-NCR) పరిధిలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు భారీగా పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ఈరోజు (ఆగస్టు 29) ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వచ్చేలా కిలో సీఎన్జీపై ₹3.89 చొప్పున పెంపును ప్రకటించింది. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర ₹86.98 కి చేరింది. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని ఐజీఎల్ పేర్కొంది
2026 సంవత్సరంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సీఎన్జీ ధరలు పెరగడం ఇది ఐదవసారి. గడిచిన మే నెలలోనే దాదాపు కిలోకు ₹6 వరకు పెంచారు. ఈ తాజా ధరల పెరుగుదల వల్ల ఢిల్లీలో నివసించే లక్షలాది మంది వాహనదారులు, ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నగరంలో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పర్యావరణ అనుకూల ఇంధనంగా భావించే సీఎన్జీ ధరలు ఇలా నిరంతరం పెరగడంపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi