
విశాఖపట్నం, 06 ఆగస్టు (హి.స.)
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాథుర్ స్పష్టం చేశారు. ఈ పుష్కరాలు నేపథ్యంలో మూడు రైల్వేస్టేషన్లు.. రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గురువారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ రైల్వేస్టేషన్లో అదనంగా 6 నూతన రైల్వే ప్లాట్ ఫారమ్లు, 6 కొత్త రైల్వే లైన్లు వేయనున్నట్లు వివరించారు. నూతన ఎలక్ట్రానిక్ సిగ్నల్ వ్యవస్థ కూడా వస్తుందని అన్నారు. మరిన్ని కొత్త రైళ్లు విశాఖ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. బళ్లారి వైపు రైళ్లు పెంచుతున్నామని చెప్పారు.
తిరుపతికి ట్రాఫిక్ అధికంగా ఉందన్నారు. విజయవాడలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మరిన్ని రైళ్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే విశాఖపట్నం నుంచి ఇప్పటికే అనేక కొత్త రైలు ప్రతిపాదన చేశామని ఆయన గుర్తు చేశారు. రైల్వే బోర్డు అంగీకరించిన తరవాత విశాఖ నుంచి పూర్తి షెడ్యూల్తో అవి నడుస్తాయని జీఎం సందీప్ మాథుర్ పేర్కొన్నారు.
కోటి పల్లి - నరసాపురం రైల్వే లైన్ కోసం ప్రభుత్వం నుంచి కొంత భూమి అవసరం అవుతుందని.. దీనిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. పలు వందేభారత్ రైళ్లు విశాఖపట్నం వస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే గోదావరి ఉప నదులపై వంతెనల నిర్మాణాన్ని కొంత పూర్తి చేశామని వివరించారు. నరసాపురం- బెంగళూరు, తిరుపతి-విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లను రెగ్యులర్ చేస్తున్నట్లు వివరించారు. విజయవాడ, గుంతకల్లు డివిజన్లతో చర్చలు జరిపామన్నారు. కృష్ణపట్నం పోర్ట్ ఉత్పతి పెరుగుతోందని వివరించారు. ఈ ఏడాది 108 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ