
హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.) సామాజిక న్యాయ తెలంగాణను తీర్చాదిద్దాడానికి ముందున్నామని టీఆర్ఎస్(తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఈరోజు(గురువారం) సరూర్నగర్లో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో మాట్లాడుతూ.. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు సామాజిక న్యాయం కోసం పాటుపడలేదని విమర్శించారు. ఈ సభ తెలంగాణలో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని, అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకురానుందని వెల్లడించారు.
సామాజిక న్యాయం అనగానే అందరూ భయపడుతున్నారని.. అయితే ఇది ధర్మపోరాటమని కవిత అన్నారు. రాష్ట్రంలో బీసీలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంచిందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరస్పరం ప్రేమ లేఖలు రాసుకుంటారని.. బీసీ బిల్లుకు ఆమోదం తీసుకురావడంలో ఈ దోస్తీ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు బీసీ బిల్లుకు ఆమోదం రాకపోతే సంక్రాంతి తర్వాత ఢిల్లీకి వెళ్లి ఉద్యమం చేపడతామని కవిత హెచ్చరించారు.
తెలంగాణలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోందని కవిత అన్నారు. తాను అగ్రవర్ణ కుటుంబంలో పుట్టినా, అణగారిన వర్గాల కోసం చివరి వరకూ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అగ్రవర్ణాలకు చెందిన వారంతా కూడా బుద్ధుడి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని, అలాగే ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని కవిత డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్