
హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.)
దేశంలో నానాటికీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మరియు వాటి వల్ల జరుగుతున్న మరణాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.8 లక్షల మంది కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన గురువారం పార్లమెంట్లో వెల్లడించారు . ఈ గణాంకాలు అత్యంత బాధాకరమని, యుద్ధాలు లేదా తీవ్రవాద దాడుల కంటే కూడా రోడ్డు ప్రమాదాల వల్లే దేశంలో ఎక్కువ మంది మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాలను పెంచడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు
రోడ్డు ప్రమాదాల నివారణకు కేవలం ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవని, ప్రజల్లో కూడా సామాజిక బాధ్యత మరియు అవగాహన పెరగాలని మంత్రి పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న ప్రమాదాలలో అధిక శాతం అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లే జరుగుతున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 18 నుండి 45 ఏళ్ల లోపు ఉన్న యువకులే ఈ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం వల్ల దేశ ఉత్పాదకతకు, ఆయా కుటుంబాలకు తీరని లోటు జరుగుతోందని నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రహదారుల రూపకల్పనలో సమూల మార్పులు చేస్తోందని మంత్రి వివరించారు. ప్రమాదాలకు కారణమవుతున్న 'బ్లాక్ స్పాట్స్' (ప్రమాదకర ప్రాంతాలు) గుర్తించి వాటిని సరిచేయడం, వాహనాలలో ఎయిర్బ్యాగ్ల సంఖ్యను పెంచడం, క్రాష్ టెట్సింగ్ ప్రమాణాలను (BNCAP) కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi