
నిజామాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి సూచించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై గురువారం భీంగల్లోని సహస్ర కన్వెన్షన్ హాల్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, రహదారులకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిబంధనలకు అనుగుణంగా సౌండ్ సిస్టమ్ను వినియోగించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు