
తిరుమల, 10 సెప్టెంబర్ (హి.స.)శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించే భక్తుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. అదేవిధంగా, కొండపై సహజంగా మరణించే భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని ఆలయాల పరిపాలనలో ఇలాంటి పథకం అమలు చేయడం ఇదే తొలిసారని టీటీడీ పేర్కొంది.
తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన దర్శనం కల్పించడమే తమ లక్ష్యమని ఛైర్మన్ మీడియాకు తెలిపారు.
మరియు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవన్లో ఛైర్మన్ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV