
నందిగ్రామ్, 19 సెప్టెంబర్ (హి.స.)
అక్టోబర్ 6న జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ఎదురుదెబ్బలు తగిలాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పేరు, 'జోరా ఘాస్ ఫూల్' (రెండు పువ్వులు - గడ్డి) గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా సీజ్ చేసిన పరిణామాల మధ్య నామినేషన్ల విషయంలో తీవ్ర రాజకీయం నడుస్తోంది.
నందిగ్రామ్లో అభ్యర్థి వాకౌట్ – కాంగ్రెస్కు మద్దతు:
నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ వర్గం ('మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్') తరఫున పోటీలో దిగిన సంచిత ప్రధాన్ డే, నామినేషన్ల ఉపసంహరణకు ముందు బీజేపీ నేత, సీఎం సువేందు అధికారితో భేటీ అయి అనూహ్యంగా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కడ అభ్యర్థి లేకపోవడంతో INDIA కూటమిలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్కు మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.
మమతా బెనర్జీ మద్దతు ప్రకటించిన కొద్ది గంటల్లోనే, 2007 నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమం నాటి పాత కేసులను తిరగదోడి కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రెజీనగర్ అభ్యర్థి ఉపసంహరణ నాటకం:
మరో స్థానమైన రెజీనగర్ లో మమత వర్గం అభ్యర్థి రబివుల్ ఆలం చౌదరి కూడా కొత్త గుర్తుతో (ఫుట్బాలర్) ప్రచారం చేయడం, కార్యకర్తలపై జరుగుతున్న వరుస అరెస్టుల వల్ల నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ఉదయం ప్రకటించారు. అయితే మమతా బెనర్జీ జోక్యం చేసుకుని రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పోటీలో ఉంటానని వెల్లడించారు.
ఈ ఉపఎన్నికల్లో ఈసీ తాత్కాలికంగా మమత వర్గానికి 'ఫుట్బాల్ ప్లేయర్' గుర్తును, తిరుగుబాటు అరూర్ రాయ్ వర్గానికి (డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్) 'ఇన్వెలప్' గుర్తును కేటాయించింది. కొద్దిరోజులుగా అభ్యర్థుల ఉపసంహరణలు, హఠాత్ అరెస్టులతో బెంగాల్ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi