
అయోధ్య, 02 సెప్టెంబర్ (హి.స.)
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యొక్క మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా బుధవారం నియమితులయ్యారు. ఆలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవుల నుండి తప్పుకున్న తర్వాత, ఆలయ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ సిఈఓ నియామకాన్ని ట్రస్ట్ ప్రకటించింది.
సిఈఓగా, ఆలయ ట్రస్ట్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడంలో, విస్తరిస్తున్న కార్యకలాపాలను సమన్వయం చేయడంలో మిశ్రా కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. యాత్రికుల సౌకర్యాల నిర్వహణ, ఆర్థిక, పరిపాలనా ఏర్పాట్లు, సిబ్బంది సమన్వయం, భద్రతా సంబంధిత అంశాలు, ప్రధాన మతపరమైన కార్యక్రమాల ఏర్పాట్లు వంటివి ఆయన బాధ్యతలలో ఉండవచ్చు.
“ఆపరేషన్ సింధూర్ సమయంలో జీతేంద్ర మిశ్రా కీలక పాత్ర పోషించారు. ఈ సమయంలో అవసరమైన క్రమశిక్షణ, నిర్వహణను ఆయన తీసుకువచ్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఆయన రామ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తారు. ఆయన పెద్ద ఆపరేషన్లను నిర్వహించారు, కాబట్టి ఈ పాత్రకు అత్యంత అనువైనవారు.” అని ఎంపిక కమిటీ సభ్యుడు సురేష్ హవారే తెలిపారు.
హవారే విశ్రాంత అణు శాస్త్రవేత్త. ఆయన అణుశక్తి విభాగంలో 27 ఏళ్లపాటు పనిచేశారు. షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కు అధిపతిగా ఉన్నారు. ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీలోని ఇతర ఇద్దరు సభ్యులు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది.
సిఈఓ పదవికి మాజీ ఐపీఎస్ అధికారి రాజేష్ పాండే, మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ చంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యోగేశ్వర్ రామ్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి పరేష్ సక్సేనా వంటి వారు కూడా పోటీలో ఉన్నారు. అంతకుముందు, రామ మందిర పరిపాలనాపరమైన మార్పులలో భాగంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ముగ్గురు కొత్త ట్రస్టీలను నియమించింది.
ఢిల్లీకి చెందిన మహేష్ భాగ్చంద్కా, అయోధ్య నివాసి మదన్ మోహన్ పాండే, షికోహాబాద్కు చెందిన నిర్మలా యాదవ్ కొత్త ట్రస్టీలుగా నియమితులయ్యారు. భాగ్చంద్కా ‘అశోక్ సింఘాల్ ఫౌండేషన్’లో ట్రస్టీగా ఉన్నారు మరియు దివంగత ఆర్ఎస్ఎస్ నాయకుడిపై ఒక పుస్తకాన్ని కూడా రచించారు.
ఆయన ప్రతి ఏటా ‘కార్యసేవక్ పురం’లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు సైకిళ్ల పంపిణీ, ఆరోగ్య శిబిరాలకు మద్దతు వంటి కార్యక్రమాలు ఉన్నాయి. పాండే ఒక న్యాయవాది, విశ్వహిందూ పరిషత్తో అనుబంధం కలిగి ఉన్నారు. రామజన్మభూమి కేసు సుప్రీంకోర్టుకు చేరడానికి ముందు, స్థానిక కోర్టులలో ఆ కేసు వాదనల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఎవరు ఈ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా?
ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా (సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకం – ఎస్వైఎస్ఎం), అతి విశిష్ట సేవా పతకం – ఏవిఎస్ఎం, విశిష్ట సేవా పతకం – విఎస్ఎం గ్రహీత) భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ అధికారి. ఆయన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ‘ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్’గా పనిచేశారు. అలాగే ‘ఆపరేషన్ సింధూర్’లో కీలక పాత్ర పోషించారు.
ఎయిర్ మార్షల్ మిశ్రా ఏప్రిల్ 30, 2026న భారత వైమానిక దళం నుండి పదవీ విరమణ చేశారు. విశిష్ట సేవలకు గాను ఆయనకు ‘సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకం’ లభించింది. మిశ్రా ఉత్తరప్రదేశ్లోని డియోరియాకు చెందినవారు. కమాండింగ్ ఆఫీసర్గా, ఆయన దూరదృష్టితో కూడిన ప్రణాళిక, నాయకత్వం, మిగ్-21 విమానాల సర్వీసబిలిటీని అత్యంత ఉన్నతంగా ఉండేలా చూసింది.
దీని ఫలితంగా, ఆ విమానాల సముదాయం పాతదైనప్పటికీ, యూనిట్ చాలా అధిక కార్యాచరణ సంసిద్ధతను కలిగి ఉంది. 38 సంవత్సరాలకు పైగా సాగిన తన సర్వీస్ కెరీర్లో, ఎయిర్ మార్షల్ ముఖ్యమైన కమాండ్, స్టాఫ్ పదవులను నిర్వహించారు.
వీటిలో ఫైటర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, ఎయిర్క్రాఫ్ట్ & సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏఎస్టిఈ)లో చీఫ్ టెస్ట్ పైలట్, రెండు ఫ్రంట్లైన్ ఎయిర్ బేస్లకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, డైరెక్టర్ (ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ అసెస్మెంట్ గ్రూప్), ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఎస్ఎస్ఆర్), ఎయిర్ హెచ్క్యూ (విబి)లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్), కమాండెంట్ ఏఎస్టిఈ, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (డాక్ట్రిన్, ఆర్గనైజేషన్ అండ్ ట్రైనింగ్) వంటివి ఉన్నాయి. తన ప్రస్తుత పదవిని చేపట్టడానికి ముందు ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఆపరేషన్స్)గా పనిచేశారు.
రామ మందిర సీఈఓ నియామకం పక్రియ
సీఈఓ ఎంపిక ప్రక్రియలో ఏఐ-ఆధారిత స్క్రీనింగ్తో పాటు మాన్యువల్ అసెస్మెంట్ను కూడా కలిపారు. దరఖాస్తులను పరిశీలించడానికి 600 మార్కుల మూల్యాంకన విధానాన్ని ఉపయోగించగా, ప్రాథమిక మదింపులో 3,577 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. 470 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయగా, ఆగస్టు 11, 12 తేదీలలో అయోధ్యలో 108 మంది దరఖాస్తుదారులతో వర్చువల్ సంభాషణలు, 16 మంది అభ్యర్థులతో తుది ఇంటర్వ్యూలు జరిగాయి.
సీఈఓ పదవికి మొత్తం 5,585 మంది దరఖాస్తు చేసుకోగా, 3,570 మంది అభ్యర్థులు తమ దరఖాస్తు పత్రాలను పూర్తి చేసి తిరిగి పంపారు. సీఈఓను ఎంపిక చేసేందుకు జూలై 6న ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi