
హైదరాబాద్, 03 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్న కొండా దంపతులు తమ తదుపరి రాజకీయ నిర్ణయంపై కీలక ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు తమ నివాసంలో అనుచరులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అనుచరుల అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. దీంతో కొండా దంపతుల నివాసం వద్ద రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. తమతో కలిసి పనిచేసే ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యులతో సమావేశం అనంతరం భవిష్యత్ అడుగుపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్లో కొనసాగింపుపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించేందుకు వారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ముందుగా పార్టీ నిర్ణయాన్ని పరిశీలించి, అనంతరం తమ రాజకీయ భవిష్యత్పై ప్రకటన చేయాలా లేదా స్వతంత్రంగా తమ నిర్ణయాన్ని వెల్లడించాలా అనే అంశంపై కుటుంబంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమావేశం, ఆ తర్వాత 3 గంటలకు కొండా దంపతులు చేయబోయే ప్రకటనపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్