
అమరావతి, 04 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. శనివారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నారు.
పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు పీఆర్సీ, డీఏ బకాయిలు తదితర సమస్యలపై చర్చించనున్నారు. గురువారం ఏపీ జేఏసీ నేతలు ఎ.విద్యాసాగర్, డీవీ రమణ, భారతీ ప్రసాద్ తదితరులు సీఎం చంద్రబాబును కలిశారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల ఆందోళనలకు సంబంధించిన అంశాలను విద్యాసాగర్ వివరించారు. పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం ఈ సందర్భంగా వారికి చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు న్యాయంగా చేయాల్సిన వాటిని ఒక్కొక్కటిగా చేస్తున్నామని చెప్పినట్టు సమాచారం. చర్చలు జరుపుతున్నా ఓర్పు పట్టలేకపోవటాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. తాము కూడా చర్చలను ఆహ్వానిస్తున్నామని ఏపీ జేఏసీ నాయకులు చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరగాలని కోరుకుంటున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ