
శ్రీహరికోట, 04 సెప్టెంబర్ (హి.స.) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ విజయాన్ని సాధించింది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా ఈవోఎస్-05 (జిశాట్-1ఏ) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష సామర్థ్యం మరో మెట్టు పైకెక్కినట్లయింది.
భూస్థిర కక్ష్య నుంచి పనిచేయనున్న భారత్ తొలి ఇమేజింగ్ శాటిలైట్ ఇదే కావడం ఈ ప్రయోగం ప్రత్యేకత. భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ, భూభ్రమణంతో పాటే ఇది తిరుగుతుంది. దీనివల్ల భారత ఉపఖండం, పరిసర ప్రాంతాలపై నిరంతరం ఒక కన్ను వేసి ఉంచడం సాధ్యమవుతుంది. సాధారణంగా లోయర్ ఎర్త్ ఆర్బిట్లోని ఉపగ్రహాలు ఒక ప్రాంతంపై నుంచి పరిమిత సమయం మాత్రమే వెళ్తాయి. కానీ, ఈవోఎస్-05 స్థిరంగా ఒకే ప్రాంతాన్ని పర్యవేక్షించగలదు.
ఈ ఉపగ్రహం ప్రతి 30 నిమిషాలకు ఒకసారి మొత్తం భారత భూభాగాన్ని చిత్రీకరించగలదు. ప్రకృతి వైపరీత్యాలైన తుఫానులు, వరదలు, అడవుల్లో కార్చిచ్చులను ముందుగా పసిగట్టడంలో, వాతావరణ మార్పులను గమనించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయం, జలవనరుల నిర్వహణ, సరిహద్దు ప్రాంతాల పర్యవేక్షణలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV