
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.) అసెంబ్లీ సమావేశాలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలను 15రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈరోజు (సోమవారం) గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ కోసం పోరాడిన అమర వీరులకు బీజేపీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 22ఏ భూదందాతో వేల కోట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంపాదిస్తున్నారని ఆరోపించారు.
మరియు 22ఏ సర్వే నెంబర్ల ప్రోహిబిటేడ్ జాబితాలో పెట్టారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు కావట్లేదని.. ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
22ఏ భూ దందాతో పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ తరుపున తాము పోరాటం చేస్తామని అన్నారు. న్యాయమైన భూములను 22ఏ లో పెట్టకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
22 ఏ భూముల విషయంలో సీఎం రేవంత్రెడ్డి.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, మంత్రి పొంగులేటితో రాజీనామా చేయించాలని మహేశ్వర్ రెడ్డి పట్టుబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్, పోలీస్ నోటిఫికేషన్ లాంటి సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతామని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ధరణి, భూభారతిపై సమగ్ర విచారణ జరపాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్