
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ శాసనసభ ఆవరణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ (పీఎస్) రాజు ఆకస్మికంగా మృతి చెందారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం విధులకు హాజరైన రాజు, ఆవరణలో ఉన్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కింద కుప్పకూలిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే స్పందించి, ఆయనకు ప్రాథమిక చికిత్సగా సీపీఆర్ (CPR) చేసి కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం రాజును మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆస్పత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. రాజు మృతి పట్ల పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజు అకాల మరణం పట్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..