ఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును, ఆర్థిక స్వరూపాన్ని మార్చే దిశగా ఒక చరిత్రాత్మక ఒప్పందం జరగనుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖపట్నం కేంద్రంగా రూ.88,628 కోట్ల (10 బిలియన్ డాలర్ల) భారీ వ్యయంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు, దేశంలోనే తొలి 'గూగుల్ ఏఐ హబ్' ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై మంగళవారం ఢిల్లీలో సంతకాలు జరగనున్నాయి.
ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఈ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, గూగుల్ అనుబంధ సంస్థ 'రైడెన్' ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్డీఐ) ఇదే అతిపెద్దదిగా నిలవనుండటం విశేషం.
ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ గతేడాది అక్టోబర్లో అమెరికా పర్యటనలో బీజం వేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరం 'ఏఐ సిటీ'గా మారనుంది. గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుతో టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ గ్లోబల్ హబ్గా ఎదగనుంది. ప్రభుత్వం అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు వల్ల 2028-2032 మధ్య కాలంలో ఏటా రాష్ట్ర జీఎస్డీపీకి రూ.10,518 కోట్లు చేకూరడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,220 ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన సింగిల్ విండో క్లియరెన్స్, మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధన వనరులను వేగంగా సమకూర్చేందుకు ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు, ఐటీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV