ఢిల్లీ, 13 జూన్ (హి.స.) ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 12 శాతం పైగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్ 12.6 శాతం పెరిగి 76.61 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ 12.2 శాతం పెరిగి 77.77 డాలర్లకు చేరింది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం (Iran-Israel conflict) చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ దాడులతో హర్మోజ్ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చనే ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చమురు రంగ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) షేర్లు 6.1 శాతం తగ్గి రూ.299.20 వద్ద ట్రేడవుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) షేర్లు 3.9 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) షేర్లు 5.3 శాతం నష్టపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు