నల్గొండ, 28 జూన్ (హి.స.)
జిల్లాలో రైతులను, అమాయక
ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసగాళ్లు షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అంటూ అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఎవరైనా అధిక వడ్డీ ఇస్తామని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంధువులు, చుట్టు పక్కన వాళ్లను ఎంచుకుని మన మధ్యలో ఉంటూ ఎక్కడికి వెళ్లడు మనవాడిలా నమ్మిస్తూ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు.
అలాగే ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ అధిక వడ్డీలను వసూలు చేసే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహించడం చట్టరీత్యా నేరం అన్నారు. వడ్డీకి డబ్బులు ఇచ్చి దానికి బదులుగా భూమిని తమ పేరుపై సేల్ డీడ్ను చేసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సైబర్ నేరాల పట్ల అనేక అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎవరైనా అధిక వడ్డీలు వసూలు చేసినా, అధిక వడ్డీలు ఇస్తామని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినా, అలాంటి వారి సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్కు అందించాలని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్