చిత్తూరు, 9 జూలై (హి.స.)ఏపీలో మామిడిపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగేందుకు వైసీపీ అధినేత ఇవాళ చిత్తూరు వెళ్తున్నారు.
బంగారుపాళ్యం మామిడిమార్కెట్ను జగన్ సందర్శించనున్నారు. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది పోలీస్ శాఖ. మ్యాంగో మార్కెట్లో 500 మందికి మాత్రమే అనుమతించారు. హెలిప్యాడ్ దగ్గరకు 30 మందికి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. రోడ్షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు ఎస్పీ. షరతులు ఉల్లంఘిస్తే రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
పోలీస్ ఆంక్షలపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. విపరీతమైన ఆంక్షలు పెట్టి వైసీపీ కేడర్ను భయపెడుతున్నారని వైసీపీ నేత భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సల్స్ను గాలించినట్లు వైసీపీ నేతలు గాలిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి రౌడీషీట్ తెరుస్తామని ఎస్పీ బెదిరిస్తున్నారని భూమన కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే మామిడి రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం, మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కేవలం రాజకీయం కోసమే.. జగన్ పర్యటనలు అంటూ విమర్శిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి