తిరుమల, 23 సెప్టెంబర్ (హి.స.)
దసరా సెలవులు మొదలైనా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గడం విశేషం. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కానీ మంగళవారం (సెప్టెంబర్ 23) మాత్రం భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి దర్శనం 8 గంటల్లో జరుగుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3-5 గంటలు, రూ.300 శీఘ్ర దర్శనానికి 1-3 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
నిన్న (సోమవారం) స్వామివారిని 60,681 మంది భక్తులు దర్శించుకోగా.. 19,510 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి