
అమరావతి, 22 జనవరి (హి.స.)వచ్చే నెలలో అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు అన్ని అనుమతుల సాధన కోసం కేంద్రంతో మాట్లాడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబుతో ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్ సమావేశమయ్యారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. తొలిదశలో దాదాపు రూ.60,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. లక్ష్మీమిట్టల్ సమక్షంలోనే చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి అన్ని అనుమతులనూ సాధించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి అధికారులతో మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వ సహకారంలో ఎక్కడా లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సమన్వయం చేసుకోవాలని మంత్రులు లోకేశ్, భరత్లకు సీఎం సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ