
హైదరాబాద్, 22 జనవరి (హి.స.)
, , అమరావతి: జేఈఈ మెయిన్ పేపర్-1 తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్ల పరీక్షల్లోనూ గణితం కఠినంగా, సుదీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయి. 3డీ జామెట్రీ, వెక్టర్స్, ఆల్జీబ్రా లాంటి పాఠ్యాంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని నిపుణులు తెలిపారు. కాలిక్యులేషన్కు ఎక్కువ సమయం పట్టిందని విద్యార్థులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా బుధవారం నుంచి జేఈఈ మెయిన్ పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రసాయన శాస్త్రంలో ఈసారి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. వాటికి ఎక్కువ సమయం పట్టింది. భౌతికశాస్త్రం ప్రశ్నలు సులభం నుంచి మధ్యస్థంగా ఉన్నాయి. ‘టాపర్లు సైతం 300కి 300 మార్కులు సాధించడం చాలా కష్టం’ అని శ్రీచైతన్య విద్యాసంస్థల ఐఐటీ జాతీయ కోఆర్డినేటర్ ఎం.ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా ప్రశ్నలు మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్నాయని, ఏ ఒక్క ప్రశ్నలోనూ సందిగ్ధత లేదని ఆయన చెప్పారు. విజయవాడ శారద విద్యా సంస్థల గణిత నిపుణుడు విఘ్నేశ్వరరావు మాట్లాడుతూ మోడ్రన్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్ విభాగాల నుంచి డైరెక్ట్ ఫార్ములా ఆధారిత ప్రశ్నలతో పాటు కొన్ని సంక్లిష్టమైన ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ