
కందకుర్తి, 11 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన కందకుర్తి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామమైన ఇక్కడ, సుమారు ₹10 కోట్ల వ్యయంతో నిర్మించిన 'శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని' ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ 2026 ఏప్రిల్ 11న ఘనంగా ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి కావస్తున్న (శతాబ్ది) వేళ ఈ కార్యక్రమం జరగడం విశేషం.
ఈ స్మృతి మందిరాన్ని మూడు ఎకరాల విస్తీర్ణంలో, అత్యంత కళాత్మకమైన రెండంతస్తుల భవనంగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లో డాక్టర్ హెడ్గేవార్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించగా, మొదటి అంతస్తులో దేశభక్తికి చిహ్నంగా 'భారతమాత' విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భవన ప్రాంగణంలో హెడ్గేవార్ జీవిత ప్రస్థానాన్ని, సంఘ్ అభివృద్ధిని వివరించే అరుదైన ఛాయాచిత్రాల ప్రదర్శనశాల (మ్యూజియం) పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది
ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో మోహన్ భగవత్ గారు ప్రసంగిస్తూ, కందకుర్తి కేవలం ఒక గ్రామం మాత్రమే కాదని, అది జాతీయవాదానికి పురిటిగడ్డ అని పేర్కొన్నారు. వ్యక్తుల కంటే విలువలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మందిరం కేవలం భవనం కాదు, ఇది సమాజ సేవకు మరియు దేశభక్తికి స్ఫూర్తినిచ్చే కేంద్రం అని ఆయన ఉద్ఘాటించారు. ప్రతి స్వయంసేవకుడు గ్రామీణ వికాసానికి, సామాజిక సమరసతకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi