

ఢిల్లీ , 13 జూన్ (హి.స.)నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 17నుంచి వచ్చే నెల 14 వరకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విద్యార్థుల సదస్సులు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తొలుత రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల సదస్సు ఉంటుందని వెల్లడించింది. పేపర్ లీక్ కుంభకోణాల వల్ల నష్టపోయిన విద్యార్థులు ఈ సదస్సుల ద్వారా తమ గళాన్ని వినిపించవచ్చని పేర్కొంది. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై యూనివర్సిటీలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లలో ముఖాముఖీ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో సైతం పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు నిర్వహిస్తామని వెల్లడించింది. రాజకీయాలను అతీతంగా విద్యార్థులను ఏకం చేస్తామని వివరించింది. ప్రవేశ పరీక్షల్లో అవకతవకలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు పట్టుపడతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని.. దేశ ప్రజలకు జవాబుదారీగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi