
రేణిగుంట, 06 ఆగస్టు (హి.స.)గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రేణిగుంట పోలీసులు ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు రేణిగుంట సీఐ జయచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు గంజాయి నిర్మూలిద్దాం – Action After Awareness అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు రేణిగుంట పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, అందరూ మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన సూచించారు. పరీక్ష చేద్దాం – మత్తును వదిలిద్దాం అనే సందేశంతో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి గంజాయి నిర్మూలనలో భాగస్వాములు కావాలని రేణిగుంట సీఐ జయచంద్ర విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV