
తిరుపతి, 07 సెప్టెంబర్ (హి.స.) తిరుపతి జిల్లా శేషాచలం అటవీ సరిహద్దు తుమ్మసేనపల్లి పరిసరాల్లో ఏనుగుల సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన వారం రోజులుగా తీష్ట వేసి రాత్రి వేళల్లో అలజడి సృష్టిస్తోంది.
గ్రామ సమీపంలోకి వస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చేతికొచ్చిన పంటలను ఏనుగులు తొక్కి పాడుచేస్తుండటంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. తమ జీవనోపాధి దెబ్బతింటోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లేందుకు కూడా తీవ్రంగా భయమేస్తుందని వాపోతున్నారు.
అధికారులూ స్పందించండి.. అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఏనుగులను తిరిగి అడవిలోకి తరలించే చర్యలు వేగవంతం కావడం లేదని తుమ్మసేనపల్లి గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్ళించాలని కోరుతున్నారు. అలాగే నష్టపోయిన తమకు తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV