అమరావతి, 3 అక్టోబర్ (హి.స.) 'కాంతార చాప్టర్ 1' చిత్రంతో మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన పాత రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు తన సినిమాకు కనీసం ఒక్క షో కూడా దొరకని పరిస్థితి నుంచి, నేడు వేల హౌస్ఫుల్ షోలతో అఖండ విజయాన్ని అందుకోవడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
శుక్రవారం తన 'ఎక్స్' ఖాతాలో రిషబ్ శెట్టి ఒక పోస్ట్ పెట్టారు. 2016లో ఒక్క సాయంత్రం షో కోసం కష్టపడటం నుంచి 2025లో 5000 హౌస్ఫుల్ షోల వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం మీ ప్రేమ, మద్దతు, దేవుడి దయ వల్లే సాధ్యమైంది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా, తొమ్మిదేళ్ల క్రితం తాను పడిన కష్టాన్ని గుర్తుచేస్తూ 2016 నాటి తన పాత పోస్ట్ను కూడా షేర్ చేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత, మా సొంత ఊరు మంగళూరులోని బిగ్ సినిమాస్లో రేపటి నుంచి సాయంత్రం 7 గంటలకు ఒక షో దొరికింది. చూడాలనుకునే వారు దయచేసి టికెట్లు బుక్ చేసుకోండి అని అప్పట్లో ఆయన రాసుకొచ్చారు.
'కాంతార చాప్టర్ 1' చిత్రంపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. 'యానిమల్' చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను ఆకాశానికెత్తారు. 'కాంతార చాప్టర్ 1' ఒక నిజమైన మాస్టర్పీస్. భారతీయ సినిమా ఇంతకుముందెన్నడూ ఇలాంటిది చూడలేదు. ఇది ఒక సినిమాటిక్ తుఫాను, అద్భుతం, కదిలించలేనిది. రిషబ్ శెట్టి ఒక్కడే దీనిని రూపొందించి, తన భుజాలపై మోశారు అని సందీప్ వంగా కొనియాడారు.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా రిషబ్ శెట్టి ప్రతిభను మెచ్చుకున్నారు. 'కాంతార చాప్టర్ 1' బృందానికి ఘన విజయం సాధించినందుకు అభినందనలు. రిషబ్ శెట్టి గారు ఒక అద్భుతమైన నటుడిగా, ప్రతిభావంతుడైన దర్శకుడిగా ఊహకందని విజయాన్ని సాధించారు. ఆయన విజన్ను నమ్మి నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్కు, నటీనటులు, సిబ్బందికి నా శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ తెలిపారు.
కాగా, 2022లో వచ్చిన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్గా 'కాంతార: చాప్టర్ 1' తెరకెక్కింది. జానపద కథలు, దైవత్వం, మానవ భావోద్వేగాల సమ్మేళనంగా వచ్చిన ఈ చిత్రం విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV