
కాబుల్, 3 నవంబర్ (హి.స.)ఆఫ్ఘనిస్థాన్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ-షరీఫ్ సమీపంలో భూమి తీవ్రంగా కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. ఈ భూకంపం వల్ల గణనీయమైన ప్రాణనష్టం జరగడంతో పాటు విపత్తు తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించింది.
యూఎస్జీఎస్ వివరాల ప్రకారం, మజార్-ఎ-షరీఫ్ నగరానికి సమీపంలో భూమికి 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారు 5.23 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో భూకంపం సంభవించడంతో యూఎస్జీఎస్ తన పేజర్ వ్యవస్థలో 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రాణ, ఆస్తినష్టం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భూకంపం వల్ల జరిగిన నష్టం, మృతుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే, క్షేత్రస్థాయిలో నష్టం ఏ మేరకు జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. మరోవైపు కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్న వీడియోలు, చిత్రాలు 'ఎక్స్' (ట్విట్టర్) సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫుటేజీని స్వతంత్రంగా ధ్రువీకరించలేదని రాయిటర్స్ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV